Site icon NTV Telugu

Dabirpura: పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేశా అంటూ జ్యూస్ పంపిణీ.. తాగిన వారందరు మత్తులోకి..!

Dabirpura

Dabirpura

Dabirpura: హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్‌పురాలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్‌ను ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. అయితే, ఇక్కడే ట్విస్ట్‌ ఉంది.

Raja Singh: కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు?

అదేంటంటే.. జ్యూస్‌ తాగిన వారిలో గడచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. దాదాపు 12 మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్ర (మత్తు)లోకి వెళ్లిపోయారు. వీరంతా 12 నుంచి 15 గంటల తరువాతే మళ్లీ నిద్రలేచి, పూర్తిగా అయోమయ స్థితిలోకి చేరినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం గమనార్హం. కొందరైతే ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకూ తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే డబీర్‌పురా పోలీసులకు సమాచారం అందించారు.

దానితో పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. పోలీసులు బాధితుల స్టేట్‌మెంట్‌ తీసుకోవడమేకాకుండా.. ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు.? అతని ఉద్దేశం ఏమిటి.? ఇచ్చిన జ్యూస్‌లో ఏవైనా మత్తు పదార్థాలు కలిపారా.? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్టుమెంట్, దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మొబైల్ లవర్స్కి బంపర్ ఆఫర్.. టాప్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన Motorola..!

ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడేవరకు చెప్పలేం అంటున్నారు. జ్యూస్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేక తీవ్రమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది నివేదికలు రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు అపరిచితులిచ్చే పదార్థాలు తీసుకోవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version