Loan App Harashment: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం మౌనంగా ఉన్న యాప్ నిర్వాహకులు మళ్లీ అతడి భార్యను వేధించడం మొదలు పెట్టారు. భర్తను కోల్పోయి, నెలల చిన్నారితో పుట్టించికి చేరిన ఆ మహిళను ఫోన్ చేసి వేధిస్తున్నారు. దీంతో ఆ మహిళ తన భర్త మరణానికి కారణమైన యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయినా వారు వేధింపులు ఆపడం లేదని వాపోతుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులకు చెందిన పండిటి సునీల్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కాలంలో జాబ్ పోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో భార్య పండిటి రమ్యశ్రీ గర్భంతో ఉండడంతో అప్పుకోసం లోన్ యాప్ ను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అప్పు తీసుకున్న వారం రోజుల నుంచే సునీల్ కు ఫోన్లు, మెసేజ్ లు రావడం మొదలైందని సునీల్ భార్య రమ్యశ్రీ చెబుతోంది. ఓ రోజు తనతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఫోన్లకు కూడా మెసేజ్ లు వచ్చాయని వివరించారు.
Read Also: World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు
సునీల్ తమకు బాకీ ఉన్నాడని, ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ మెసేజ్ లో ఉందన్నారు. ఈ గొడవ కొనసాగుతుండగానే తమకు బాబు పుట్టాడని రమ్యశ్రీ వివరించారు. ఓవైపు సరైన ఉద్యోగం లేక, మరోవైపు లోన్ యాప్ వేధింపులతో 2020 డిసెంబర్ లో తన భర్త సునీల్ ఉరేసుకున్నాడని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. భర్త మరణంతో పుట్టింటికి చేరిన రమ్యశ్రీకి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. సునీల్ అప్పు తీసుకున్న మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని రమ్యశ్రీ వివరించారు. ఏడాదిగా ఈ వేధింపులు ఆగడంలేదని ఆమె వాపోయారు. వాళ్ల వేధింపుల వల్లే తాను భర్తను కోల్పోయానని, భర్త పోయాడన్న కనికరం లేకుండా తననూ వేధింపులకు గురి చేస్తున్నారని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.