తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. సరిహద్దుల్లోనే వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు మోహరించాయి. బలగాలను తోసిపుచ్చుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో వారిపై టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతలో పలువురు రైతులు గాయపడ్డారు. ఇంకోవైపు అన్ని వైపులా రోడ్లను పోలీసులు నిర్బంధించారు. రహదారులకు అడ్డంగా బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.
రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా తప్పుపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు పోరాడుతుంటే.. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం సరికాదన్నారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా అయితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని నిలదీశారు. రైతులపై బీజేపీ చేసిన దాడిని ఖండిస్తున్నట్లు ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్లో పోస్టు చేశారు.
రైతుల డిమాండ్లు ఇవే
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి
2. రైతులకు రుణమాఫీ చేయాలి
3. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
4. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒఫ్పందాలు రద్దు చేయాలి
5. ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వాలి
6. 2020లో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.
వీటిలో కనీసం మద్దతు ధర, విద్యుత్ సవరణ చట్టం ఒప్పందాలు రద్దు చేయాలి, రుణ మాఫీ, స్వామి నాథన్ సిఫారసులపై హామీ ఇచ్చినా సరేనని రైతులు స్పష్టం చేశారు. ఆ నాలుగు డిమాండ్లపై కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు.