Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత, భారత్పై ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారో, అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల భద్రతను పట్టించుకోవడం లేదు. యూనస్ సర్కారులో మతోన్మాదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్లో ఓ స్క్రాప్ వ్యాపారి హత్య ఆ దేశంలో ఆగ్రహానికి కారణమైంది. వ్యాపారిని దారుణంగా కొట్టి చంపారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత, డెడ్బాడీపై డ్యాన్సులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడం దేశ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించబడిందని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు.
Read Also: Ambati Rambabu: సైకోల్లా దాడులు చేస్తున్నారు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం..
జూలై 09న మిట్ఫోర్డ్ హాస్పిటల్ సమీపంలో లాల్ చంద్ అలియాస్ సోహాగ్ దారుణహత్యకు గురయ్యాడు. రాజధాని ఢాకాలో జరిగిన ఈ హత్య అనాగకరికమైందని చౌదరి అన్నారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు బంగ్లా నిఘా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, వారికి ఏ రాజకీయ పార్టీలో సంబంధం ఉన్న వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. మిట్ఫోర్డ్ హత్య కేసును స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్కు మార్చడానికి చర్యలు తీసుకున్నట్లు చౌదరి చెప్పారు.
గురువారం వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, వ్యాపారిని కాంక్రీట్ ముక్కలతో కొట్టి చంపడం చూడొచ్చు. ఈ మూక హత్యలో పాల్గొన్నవారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న టైటన్ గాజీ 5 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఈ హత్య దేశంలో ఆగ్రహానికి కారణమైంది. శనివారం వందలాది మంది విద్యార్థులు మూక హింసను ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని ఆరోపిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి మరో సంఘటనలో, సెంట్రల్ కుమిల్లాలోని మురాద్నగర్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఒక మహిళ మరియు ఆమె కుమారుడు మరియు కుమార్తెను కొట్టి చంపారు.