Site icon NTV Telugu

AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

Ap High Court

Ap High Court

దేవాలయ ఆచారాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భగుడిలోకి ప్రవేశించరాదన్న అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజలు నిర్వహించకూడదని కోర్టు పేర్కొంది. పూజా కార్యక్రమాల్లో సంప్రదాయ నిబంధనలు కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. 2010 నవంబర్ 10న దేవాదాయ శాఖ జారీ చేసిన సర్కులర్‌ను అమలు చేయాలని సూచించింది. అలాగే 2024 డిసెంబర్ 20న శృంగేరి పీఠం జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జారీ చేసిన ప్రామాణికానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.

Also Read: Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఈ వ్యవహారంపై శ్రీచక్ర నవార్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు సాంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకుని గర్భగుడిలో పూజలు చేస్తున్నారని, ఇది ఆచార వ్యవహారాలకు భంగం కలిగిస్తోందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది.. శాఖ సర్కులర్‌తో పాటు శృంగేరి పీఠం ప్రామాణికాలను తప్పకుండా పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. దేవాలయాల్లో పూజా విధానాలు కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version