NTV Telugu Site icon

Heavy Rains: కామారెడ్డిలో భారీ వర్షాలు..బయటకు రావొద్దంటు దండోరా..

Rains Hyderabad

Rains Hyderabad

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. కామారెడ్డిలో పరిస్థితి దారుణంగా ఉంది.. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, నల్లమడుగు మత్తడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని శ్రీరాంమ్ నగర్ కాలనీ, రుక్మిణికుంట, పంచాముఖి హనుమాన్ కాలనీ, అయ్యప్ప నగర్ కాలనీ పూర్తిగా జలమయం అయ్యాయి.

రోడ్లపైకి వచ్చి చేరిన వరద నీటితో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పలు గ్రామాలలో దండోరా వేయించి ఇళ్లలోంచి బయటకు రావద్దని గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లో వస్తున్న నీటితో పాటు సర్పాలు కూడా వస్తున్నాయని ప్రజలు చెప్పుకోస్తున్నారు.. చీకట్లోనే జనాలు బిక్కు బిక్కుమంటున్నారు..

అలాగే మరోవైపు అటు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భారీ వర్షాలతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి, మంజీర నదులకు వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సాలుర మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్రలోని బిలోలి – బోధన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సకాలంలో కురవకపోవడంతో 30 శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి తలకిందులైంది. దీంతో లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వానాకాలం సీజన్‌లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..ఇంక రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు..