విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజు ఉత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారిలో కేవలం ఆషాఢ సారె సమర్పించేందుకే 57 బృందాలుగా 23,916 మంది భక్తులు విచ్చేశారు.
ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ అధికారులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించారు. డిజిటల్ స్కానింగ్ విధానం ద్వారా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించారు. కింద రిజిస్ట్రేషన్ కాగానే కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్కు తక్షణ సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనివల్ల భక్తుల నిరీక్షణ సమయం తగ్గింది. ముఖ్యంగా సారె సమర్పించే భక్తుల సౌకర్యార్థం ‘భవాని అనుగ్రహ దర్శన్’ (రూ. 100) క్యూ లైన్ను పూర్తిగా వారికే కేటాయించారు. అలాగే ఇతర క్యూ లైన్లలో కూడా సారె భక్తులను అనుమతించారు. దీంతో మహామండపం 6వ అంతస్తు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. వచ్చిన భక్తులందరికీ ఆలయ అధికారులు ఉచిత ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అంతరాలయ దర్శనాలను, అలాగే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలుగా మార్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా భక్తులకు చల్లని తాగునీరు అందించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో బ్యాటరీ వాహనాలు, ప్రోటోకాల్ కార్యాలయం, ప్రధాన ఆలయ పరిసరాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.

