Chandrababu: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత రెడ్డి కోరారు. ఇదిలా ఉండగా.. వచ్చే మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఉందని, అదే రోజున ఈ పిటిషన్పై కూడా విచారణ చేయాలని కోర్టును చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ కోరారు. ఇద్దరు తరపున న్యాయవాదులతో మాట్లాడిన న్యాయమూర్తి.. ఈ నెల 20కి విచారణను వాయిదా వేశారు. అంగళ్లు ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో మరో 159 మంది పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా చేర్చి 20 మందిపై కేసు నమోదు చేశారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట గత నెల 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తొలుత 20 మంది టీడీపీ క్రియాశీల నాయకుల పేర్లను ప్రస్తావించారు.
Also Read: Tirumala: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఇదిలా ఉండగా.. ఇవాళ పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్కు వెళ్లనున్నారు. ఒకేసారి చంద్రబాబును జైలులో కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.