HCA: మాజీ మంత్రి సంతకం ఫోర్జరీ, వందల కోట్లు దోపిడీ.. జగన్మోహన్‌రావు అక్రమాల చిట్టా పెద్దదే!

  • ఫోర్జరీ పత్రాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్మోహన్‌
  • హెచ్‌సీఏలో వందల కోట్లు దోపిడీ
  • క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులు స్వాహా
Guruva Reddyjagan Mohan Rao

Guruva Reddyjagan Mohan Rao

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్‌ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్‌ రావు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్‌ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో పాటు శ్రీనివాసరావు, సునీత్‌, రాజేందర్‌ యాదవ్‌, కవితను సీఐడీ అరెస్టు చేసింది.

హెచ్‌సీఏ అక్రమాలపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) అధ్యక్షుడు గురువారెడ్డి వివరంగా మాట్లాడారు. ‘హెచ్‌సీఏలో జగన్మోహన్‌ రావు అక్రమాలకు పాల్పడ్డాడు. హెచ్‌సీఏలోకి అక్రమంగా జగన్మోహన్‌ ఎన్నిక అయ్యాడు. శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌కి సభ్యత్వం లేకపోయినా.. ఫోర్జరీ చేసి ఎన్నికల్లో నిలబడ్డాడు. గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ సంతకాలను ఫోర్జరీ చేశారు. మాజీమంత్రి కృష్ణ యాదవ్ సంతకాలని ఫోర్జరీ చేసి ఎన్నికల్లో దిగారు. జగన్మోహన్, రాజేంద్ర యాదవులు కలిసి హెచ్‌సీఏలో అక్రమాలు చేశారు. జగన్మోహన్ వందల కోట్ల రూపాయలను హెచ్‌సీఏ నుంచి దోచుకున్నాడు. క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐ ఇస్తున్న నిధులు మొత్తం సొంతానికి వాడేసుకున్నాడు. హెచ్‌సీఏలో సభ్యత్వానికి అర్హత లేకపోయినా దొడ్డి దారిన జగన్మోహన్ వచ్చాడు. తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో నిలబడ్డాడు’ అని గురువారెడ్డి చెప్పారు.

Also Read: Kurnool POCSO Court: నాలుగేళ్లపై బాలికపై అత్యాచారం.. కర్నూలు పొక్సో కోర్టు సంచలన తీర్పు!

‘జగన్మోహన్‌ రావు సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేయిస్తాడు. జగన్మోహన్‌ కోర్టు అడ్వకేట్‌లకు సంబంధించి వ్యతిరేక పార్టీ అడ్వకేట్‌లో కూడా డబ్బులు చెల్లిస్తాడు. జగన్మోహన్‌ చేయబట్టి హెచ్‌సీఏ పరువు పోయింది. అనధికారికంగా పలు క్లబ్బులకు జగన్మోహన్ డబ్బులు పంచాడు. సుప్రీంకోర్టు కమిటీ 57 క్లబ్బులను సస్పెండ్ చేస్తే అనధికారకంగా మళ్లీ చేర్చుకున్నాడు. ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలు జగన్మోహన్ చేశాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. జగన్మోహన్ ఆర్థిక నేరాలు, ఫోర్జరీ సంతకాలు, నిధుల దుర్వినియోగం, ఐపీఎల్ ప్రాంచైజీ బెదిరింపుల దర్యాప్తు జరుగుతుంది. హెచ్‌సీఏ కమిటీని వెంటనే రద్దు చేయాలి. హెచ్‌సీఏ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని గురువారెడ్డి కోరారు.