సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు

Harish Raoss

Harish Raoss

సామాన్యులకు ఒక రూల్, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి మరో రూలా అని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదాల వల్ల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏదైనా ఒక సర్వే నంబర్ పరిధిలో కొద్దిపాటి ప్రభుత్వ భూమి లేదా వివాదాస్పద స్థలం ఉంటే, ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22A పరిధిలోకి తీసుకురావడం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు అని విమర్శించారు. సర్వే నంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పాటించడం లేదన్నారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం చల్లూరులో 141 పేదల ఇళ్లను, ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం భీమవరంలో 361 ఎకరాల పట్టా భూమిని 22Aలో చేర్చారని, దీనివల్ల రైతులకు ఎరువులు దొరక్క, పంట సాయం అందక, పంట అమ్ముకోలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే ప్రభుత్వ ఉత్తర్వులు లేవని అధికారులు తిప్పి పంపుతున్నారని, రెవెన్యూ మంత్రి కేవలం నోటి మాటతో సారీ చెప్పి తప్పించుకుంటే సరిపోదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎన్ని లక్షల ఎకరాలను 22Aలో పెట్టిందో, ఎందుకు పెట్టిందో తెలిపేలా తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటూ అధికారుల చుట్టూ ఎందుకు తిరగాలని ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను 22A పరిధిలో పెట్టడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ఇళ్లు కూడా అందులోకి వెళ్లాయని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టగానే పరువు పోతుందనే భయంతో రాత్రికి రాత్రి వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మీసేవ ద్వారా ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండానే తమ ఇళ్లను 22A నుంచి ఎలా తొలగించుకున్నారని నిలదీశారు. చట్టంలో సీఎం, మంత్రులకు ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన, ముఖ్యమంత్రికి, మంత్రికి వర్తించిన విసులుబాటు సామాన్య ప్రజలకు ఎందుకు వర్తించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తప్పిదాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజల భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.