Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..

Brs Mla

Brs Mla

22A నిషేధిత జాబితాతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భూములను ఆ జాబితాలో పెట్టిన ప్రభుత్వమే తక్షణమే వాటిని తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తప్పు చేయకపోతే 22Aలోని భూములను వెంటనే ఓపెన్ చేయాలని, సర్వే నంబర్ల వారీగా వెరిఫై చేసి కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచాలని స్పష్టం చేశారు. ఎంత విస్తీర్ణంలో భూములను 22Aలో పెట్టారో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ 22A స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

ఈ ఇష్యూలో అధికారుల తప్పు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఆయన ప్రశ్నించారు. 22A వ్యవహారంలో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 పొంగులేటి అని ఆరోపిస్తూ, మంత్రి పొంగులేటి పొందిన లబ్ధిని త్వరలోనే అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. గతంలో ప్రభుత్వమే అమ్మిన భూములతో పాటు బోడుప్పల్, ఘట్కేసర్, అల్మాస్ గుడా, జిల్లెలగూడా, ఆదిబట్ల, మీర్పేట్ వంటి ప్రాంతాల్లో దశాబ్దాల క్రితం లేఅవుట్లు చేసుకుని, బ్యాంక్ లోన్లతో ఇండ్లు కట్టుకున్న వేలాది కుటుంబాల భూములను నిషేధిత జాబితాలో పెట్టడంపై మండిపడ్డారు.

ఒక్క పఠాన్‌చెరు నియోజకవర్గంలోనే గుమ్మడిదలలో 12,430 ఎకరాలు, అమీన్‌పూర్‌లో 3,266 ఎకరాలు, రామచంద్రాపురంలో 8,360 ఎకరాలు, పఠాన్‌చెరులో 12,593 ఎకరాల చొప్పున మొత్తం 50,565 ఎకరాల భూమిని 22A పరిధిలోకి తీసుకువచ్చారని హరీష్ రావు తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా త్వరలోనే ప్రజలు 22A (నిషేధిత) జాబితాలో పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు.