Guntur Girl Missing Case: మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గుంటూరులో పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక అదృశ్యమై ఇప్పటికే 80 రోజులు గడిచినా ఆమె ఆచూకీ కనుగొనలేకపోవడంపై ధర్మాసనం పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని నిలదీసింది. కేసు విచారణ సందర్భంగా నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదృశ్యమైన బాలికను ఇవాళ తమ ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణకు బాలికను ధర్మాసనం ముందు హాజరుపరచడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో “డీజీపీకి మేము ఇచ్చిన ఆదేశాలు అర్థమవుతున్నాయా లేదా?” అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సిట్ ఏర్పాటు చేశారంటే గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైనట్లేనా అని ప్రశ్నించింది. ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన అధికారులనే సిట్లో నియమిస్తే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాలిక ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన సిట్లో మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉండగా, వారిలో ఏడుగురు ఇప్పటికే బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైన అధికారులేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తులో విఫలమైన అధికారులకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం సరైన విధానం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరి పని వాళ్లు సక్రమంగా చేస్తే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారు?” అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే బాధితులు, వారి కుటుంబాలు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలికను సోమవారం వరకు హైకోర్టు ముందు హాజరుపరిచేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సోమవారం నాటికి అదృశ్యమైన బాలికను కోర్టు ముందు హాజరుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సోమవారం డీజీపీ స్వయంగా హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇప్పటికే బాలిక అదృశ్యమై 80 రోజులు గడిచినా ఆచూకీ కనుగొనలేకపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కంటి తుడుపు చర్యలు చేపట్టవద్దని పోలీసులను గట్టిగా హెచ్చరించింది. బాలిక అసలు ఎక్కడ ఉంది? ఆమె సురక్షితంగా ఉందా లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. బాలిక ఆచూకీని వెంటనే కనుగొని, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సోమవారం విచారణలో ప్రభుత్వం, డీజీపీ ఇచ్చే సమాధానాలు కీలకంగా మారనున్నాయి.

