నైజీరియాలో ఇటీవల రెండు వందల మందికి పైగా చిన్నారులు పాఠశాలలో అపహరణకు గురయ్యారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు, ప్రభుత్వం భయాందోళన చెందుంతోంది. తాజాగా కిడ్నాపర్ల నుంచి వర్తమానం వచ్చింది. చిన్నారుల విడుదలకు దుండగులు భారీగా నగదు డిమాండ్ చేశారు.
నైజీరియా వాయవ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి సుమారు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయి వారం రోజులు దాటింది. వారిని విడుదల చేసేందుకు కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. ఆ నగదు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు.
గుర్తుతెలియని నంబర్ నుంచి దుండగులు ఫోన్ చేశారని స్థానికులు తెలిపారు. రూ.5.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో ఆ మొత్తం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే.. అందరినీ చంపేస్తామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల కార్యకలాపాలు ప్రారంభం అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలు ధరించి మోటారు సైకిళ్లపై వచ్చినవారు విద్యార్థుల్ని చుట్టుముట్టి, గాల్లోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతులకు గురిచేశారు. అపహరణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. 287 విద్యార్థుల్ని సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. చిన్నారుల్లో పన్నెండేళ్లలోపు వారే కనీసం 100 మంది వరకు ఉన్నారు. నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా.. ఇంత భారీ సంఖ్యలో జరగడం ఇదే మొదటిసారి. అపహరణకు గురైనవారి ఆచూకీ కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి.
2021లో కూడా ఒక ప్రైవేటు పాఠశాల నుంచి సాయుధులు 140 మంది విద్యార్థులను కిడ్నాప్చేశారు. వారు డిమాండ్ చేసిన మొత్తాన్ని గడువులోగా ఇవ్వకపోవడంతో ఐదుగురు విద్యార్థుల ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దుండగులు ఏం చేస్తారోనన్న భయాందోళన ప్రజల్లో నెలకొంది.