మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతా తేడా తేడాగా ఉందా? ఎవ్వరూ ఊహించనివి ఏవేవో జరిగిపోతున్నాయా? అవన్నీ అధిష్టానం దృష్టికి వస్తున్నాయా, లేదా? ఇంతకీ… అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? వాటి గురించి నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు?
Also Read:IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రాజకీయం అంతా అలాగే ఉంది. పొత్తులో ఉన్నోళ్లు ఎదుటి వారికి, ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు.. ఇంకొకరికి మద్దతిస్తూ వాతావరణం మొత్తం తేడా తేడాగా కనిపిస్తోంది. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం విచ్చలవిడిగా ఉండే అధికార పార్టీలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సాదా సీదాగా జరిగే వ్యవహారం కూడా ఇప్పుడు చర్చలోకి వస్తోంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారంటూ.. అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. విచారణ జరిపిన స్పీకర్ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు తీర్పు ఇచ్చారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తేల్చేశారు. కానీ… అలా తీర్పు వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు.
కొన్ని చోట్ల పార్టీ వ్యవహారాలను కో ఆర్డినేట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికార ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. అరికపూడి గాంధీని నిజామాబాద్ ఎన్నికల కో ఆర్డినేటర్గా ప్రకటించింది PCC. ఇల్లందుకి.. తెల్లం వెంకట్రావ్, షాద్ నగర్కు ప్రకాష్ గౌడ్ ను కో ఆర్డినేటర్స్గా వేసింది. దీని గురించే ఇప్పుడు పార్టీలో మాట్లాడుకుటున్నారు. అంతా గమ్మత్తుగా ఉంది. వేరే పార్టీ ఎమ్మెల్యేలని స్పీకర్ తేల్చేశాక వాళ్లకే మన అభ్యర్థుల బాధ్యతలు అప్పగించడం కాస్త డిఫరెంట్గా ఉందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాళ్ళను కో ఆర్డినేటర్స్గా వేయకపోతే నష్టం ఏమైనా ఉందా..? ఓ వైపు అనర్హత వ్యవహారం అంత వివాదాస్పదం అవుతుంటే…వాళ్ళని అధికారికంగా ప్రకటించడం ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక… పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి కోసం…సొంత పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ను పక్కన పెట్టింది పార్టీ. తీరా ఇప్పుడు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ని పక్కన పెట్టి… Brs అభ్యర్ధులకు ప్రచారం చేస్తున్నారు. దీంతో చివరికి శ్రీనివాస్ గౌడే దిక్కయ్యారు. దీంతో… సొంత పార్టీ లో బలమైన నాయకుడు అనుకున్న వాళ్ళను వదిలేస్తే నష్టమని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇక జగిత్యాల నియోజకవర్గంలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. సొంత పార్టీలో మాజీ మంత్రి జీవన్రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి బీ ఫామ్స్ పంచింది పార్టీ. ఐతే.. ఎమ్మెల్యేతో వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చిన చోట…మొదటి నుండి పార్టీలో ఉన్న నాయకులు స్వతంత్రంగా పోటీ లో దిగారు.
ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీని కాదని.. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటి కంటే భిన్నంగా… పార్టీ నాయకత్వం చెప్పిన వాళ్లకు కాకుండా.. బి ఫార్మ్ లు తన సొంత వారికి ఇచ్చుకున్నారు తుంగతుర్తి MLA శామ్యూల్..చేవెళ్ల MLA కాలే యాదయ్య. చెప్పుకోవడానికి కొంచెం విచిత్రంగానే ఉన్నా.. వరుస పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. అంతా చూస్తున్నా… ప్రస్తుతానికైతే ఏమీ తెలియనట్టే ఉంది అగ్రనాయకత్వం. ఇలాంటి చిత్ర విచిత్రాలపై ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.