Site icon NTV Telugu

AP CS Vijayanand: సీఎస్‌గా విజయానంద్‌.. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి!

Ap Cs Vijayanand

Ap Cs Vijayanand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా అవకాశం ఇవ్వడంతో టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి సీఎం చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారని పలువురు టీడీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం దక్కుతుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్‌ పోస్టు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బీసీలకు నారా చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని నేతలు, అధికారులు అంటున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారిగా శ్యామల రావు నియామకం జరిగిందంటున్నారు. అటు ప్రభుత్వంలోను, పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు. తెలుగు దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం వచ్చిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్‌, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే వైఎస్ జగన్ నియమించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Exit mobile version