Site icon NTV Telugu

Gottipati Ravi Kumar: టెన్షన్ అస్సలు వద్దు.. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించం!

Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Minister Gottipati Ravi Kumar about Smart Meters in AP: వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృతి చేయాలని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు.

‘ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలి. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృతి చేయాలి. ప్రజల ఆమోదం లేనిదే ఏ విషయం మీద కూడా ముందుకు వెళ్లేది లేదు’ అని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. విద్యుత్ సరఫరాలో అవరోధాల గురించి మంత్రి గొట్టిపాటి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా ఉందని అధికారులు మంత్రి కి వివరించారు.

Also Read: AP Elections 2025: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్!

వ్యవసాయానికి ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో 9 గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటికి అధికారులు తెలిపారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లోఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ పృథ్వి తేజకు సూచనలు చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు స్థానిక కాంట్రాక్టర్ల సాయం తీసుకోవాలని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పనులు తొలిదశ పూర్తి అయితే కానీ రెండో దశకు నిధులు కోరలేమని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్‌పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతీ నియోజకవర్గంలో 10 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని మంత్రి ఆదేశించారు.

Exit mobile version