Dowleshwaram Barrage: గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 13.75 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుండి 13 లక్షల 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనితో భద్రాచలం దిగువన విలీన మండలాల నుంచి కోనసీమ వరకూ పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్ వే పై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలలో చేపడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
Read Also: AP Assembly: రెండో రోజు ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతంరెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది.. 51.30 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి పెరుగుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే స్థాయికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లు వచ్చాయి. అదే విధంగా గత మూడు రోజుల నుంచి విలీన మండలాలకు వెళ్లే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అదే విధంగా విలీన మండలాల్లో అనేక గ్రామాల చుట్టూ గోదావరి చేరుకుంది. అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, చత్తీస్గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని సమాచారం. ఈ నేపథ్యంలో గోదావరి మరో రెండు అడుగులు పెరిగి తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే నిన్నటి వరకు గోదావరి దిగువన వున్న శబరి నది భారీగా పెరిగి మళ్ళీ తగ్గి గత రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుంది. శబరి పెరిగితే గోదావరికి ప్రమాదకరంగా వుంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.