Site icon NTV Telugu

G20 Summit 2023: జీ–20 సదస్సుకు విశాఖ ముస్తాబు.. నేటి నుంచి ఆంక్షలు..

G20

G20

G20 Summit 2023: సాగర తీరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు సిద్ధమైంది.. విశాఖ వేదికగా నేటి నుంచి నాలుగు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.. ఇక, ఈ సదస్సు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విశాఖ సిటీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్‌.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో నేటి నుంచి నాలుగు రోజుల పాటు.. అంటే ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు.. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఇప్పటికే ప్రతినిధుల విశాఖకు చేరుకున్నారు..

ఇక, సదస్సు నేపథ్యంలో.. ఓవైపు విశాఖను ముస్తాబు చేసిన అధికారులు.. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.. జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్‌ వరకు వైజాగ్‌ కార్నివాల్, ఆర్కే బీచ్‌ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్‌ ఎయిర్‌ సఫారీ కూడా నిర్వహించారు. జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, జీ–20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి..

నాలుగు రోజుల పాటు జరగనున్న జీ 20 సదస్సు తొలిరోజు పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అందు కోసం ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.. ఇక, విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు సీఎం.. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించే అవకాశం ఉంది.. మరోవైపు సదస్సు నేపథ్యంలో విశాఖలో ఆంక్షలు విధించారు పోలీసులు.. బీచ్ రోడ్డుతో పాటు G 20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి… కైలాసగిరి, ముడసర్లోవ సహా వివిధ పార్కులు, టూరిజం కేంద్రాల్లో సందర్శకులకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు..

నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జీ 20 సదస్సు షెడ్యూల్‌ విషయానికి వస్తే.. తొలి రోజు అనగా 28వ తేదీన ఉదయం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్‌లోని కన్వెన్షన్‌ హాలులో జరుగుతుంది. సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్‌ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్‌ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. ఇక, రెండో రోజు అనగా 29వ తేదీ బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటా­యి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం జరగనుంది. మూడో రోజు అనగా 30వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాపు నిర్వహిస్తారు.. ఆ తర్వాత ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో ప్రతినిధులు పర్యటిస్తారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనితీరు, జిందాల్‌ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎనర్జీ తయారీ యూనిట్‌ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు. మరోవైపు.. చివరి రోజు అంటే 31వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి.

Exit mobile version