Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Train

Train

Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి దారుణంగా చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్లాట్‌ఫారం సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రత్యేక రైలు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న షేక్ చాంద్ బాషా (50), ఆయన భార్య షేక్ హసీనా (45), వారి కుమార్తెలు షేక్ షర్మిల (23), షేక్ సమీరా (20)గా రైల్వే అధికారులు గుర్తించారు. వీరిలో పెద్ద కుమార్తె షర్మిల ఎంబీఏ చదువుతోంది. చాంద్ బాషా, హసీనా దంపతులు తాడేపల్లిగూడెంలో ఒక ఆప్టికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

మృతుల నేపథ్యం పరిశీలిస్తే.. వీరి స్వస్థలం గుడివాడ కాగా, సుమారు 25 ఏళ్ల క్రితమే వీరు తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 6వ వార్డు, మామిడితోట ప్రాంతంలో గత మూడేళ్లుగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, ఈ కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ సాయంత్రం కూడా ఈ కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్‌సైకిళ్లపై ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పొరుగువారు గుర్తుచేసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ సీఐ, ఎస్‌ఐలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.