ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన నూజివీడు కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాను గుజరాత్లోని వడోదరలో అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను ప్రత్యేక పోలీసు వాహనంలో గుజరాత్ నుంచి నూజివీడుకు తరలిస్తున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. గత నెల 27న జరిగిన కిడ్నాప్ ఘటనపై ప్రత్యేక బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. పొగాకు వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదమే ఈ కిడ్నాప్కు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మేనల్లుడు షేక్ షహబాజ్ అలీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందే మైసూరుకు చెందిన ఉపేద్ హమీద్, గుంటూరు జిల్లాకు చెందిన కొండపల్లి వెంకట సంతోష్, ఈదర శశికుమార్, షేక్ భినైతుల్లా, నల్ల మేకల శాంతి స్వరూప్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు సిమ్ కార్డులు, వాహనాలు సమకూర్చడంతో పాటు పరారికి సహకరించిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాం ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి.. గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. పొగాకు ధరలను ముస్తఫా భారీగా తగ్గించడంతో.. గుంటూరులోనే మరో కంపెనీకి సూర్యచంద్రం విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పొగాకు బేళ్లను వాహనంలో తీసుకెళ్తున్న సూర్యచంద్రం కుమారుడు అభి సహా మరికొందరిని ముస్తఫా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. విషయం తెలుసుకున్న సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కిడ్నాపర్ల ముఠా బాధితులతో పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఈరోజు గుజరాత్లో ముస్తఫాను అరెస్ట్ చేశారు.

