దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు పరిచేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దళిత బంధు విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం మానుకోవాలని దళిత వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పార్టీ మారే యోచనలో లేదని స్పష్టం చేశారు.