NTV Telugu Site icon

Sidda Raghava Rao: వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు..! గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేనా..?

Sidda Raghava Rao

Sidda Raghava Rao

Sidda Raghava Rao: వైసీపీకి అధికారం చేజారి.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతన్నారు.. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‎కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట.. వారందరూ ఇతర జిల్లాలకు చెందిన నేతలు కావటంతో ఆయనకు టీడీపీలోకి ఎంట్రీకి వర్కవుట్ కావటం లేదట.. ఎక్కే గడప.. దిగే గడప అంటూ తేడా లేకుండా తిరుగుతున్నా అడుగులు ముందుకు పడటం లేదట.. దీంతో ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి.. టీడీపీలో చేరేందుకు అధినేత వద్ద మాట్లాడాలని కోరారట..

Read Also: Srisailam Dam: పర్యటకులకు అలర్ట్‌.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత..

అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన శిద్దా రాఘవరావు.. 2004లో ఒంగోలు అసెంబ్లీ నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడారు.. అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో కూడా ఆయన తిరిగి దర్శి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేయాలని భావించినా అప్పటి రాజకీయ పరిస్దితుల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్టమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది.. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి వైసీపీ అభ్యర్ది మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడారు.. అనంతరం గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో కొంతకాలం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు టికెట్ ఆశించినా.. ఆ పార్టీ అధినేత జగన్ ఆయనకు టికెట్ కేటాయించలేదు.. ఎన్నికలకు ముందే శిద్దా టీడీపీలోకి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నించటం.. ఆ పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం జరిగాయి.. అయితే, అప్పటి వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనతో నయానో.. భయానో మాట్లాడి ఒప్పించి వైసీపీ అధినేత జగన్ దగ్గరకు తీసుకు వెళ్లారు.. ఆయన కూడా పార్టీలో కొనసాగాలని గట్టిగానే చెప్పటంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఆయన ఆ పార్టీలోనే నిలబడి పోయారు..

Read Also: Rahul Gandhi : బడ్జెట్‌పై లోక్ సభలో తన అభిప్రాయాలను సమర్పించనున్న రాహుల్ గాంధీ

ఇక, గత ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆయనను గట్టిగానే టార్గెట్ చేసి ఆయనకు సంభందించిన గ్రానైట్ వ్యాపారాలను పూర్తిగా స్తంభింపచేయటంతో ఆయనకు ఉక్కిరిబిక్కిరి ఆడకపోవటంతో టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు శిద్దా.. ప్రస్తుతం తిరిగి టీడీపీ అధికారంలోకి రావటంతో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని భావించారో ఏమో.. కా,నీ వైసీపీకి రాజీనామా చేశారు.. ఆయన కుమారుడు శిద్దా సుధీర్ కు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు అప్పటి సీఎం జగన్.. 2024 ఎన్నికల్లో శిద్దా సుధీర్ కుమార్ ను పోటీ చేయాలని బావించటంతో అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్దానాల్లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కూడా ఇస్తామని చెప్పినా తాము దర్శిలో అయితేనే పోటీ చేస్తామని చెప్పటంతో సాధ్యపడలేదు.. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవటంతో తిరిగి ఆయన టీడీపీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట..

Read Also: Jio Air Fiber: బంపర్ ఆఫర్.. త్వరపడండి.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై భారీ తగ్గింపు..

సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల ద్వారా ఆయనతో మాట్లాడించి.. గతంలో తనకు ఎదురైన పరిస్థితులు.. ఆర్దికంగా తాను ఎంత నష్టపోయామన్న విషయాలను తెలియచెప్పినట్లు తెలుస్తోంది.. పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవుల హామీలు లభించకపోయినా తాను మాత్రం టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వర్తమానం పంపారట శిద్దా.. అయితే ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాక పోవటంతో జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు కలసి తన గోడు వెళ్లబోసుకున్నారట శిద్దా.. అయితే మంత్రి రవికుమార్ నుంచి శిద్దాకు ఎలాంటి హామీ దక్కలేదని సమాచారం.. ఎన్నికల సమయంలో అయితే ఏదో రకంగా సాధ్యపడేది.. ఇప్పుటికిప్పుడు కొత్త చేరికలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వక పోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.. శిద్దా చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత వరకూ సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయటం లేదని చెప్పారట మంత్రి రవికుమార్.. సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ లు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే శిద్దా టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.. దీంతో శిద్దా.. టీడీపీ చేరిక ఆశలకు మరికొంత కాలం జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మరి టీడీపీలో శిద్దా చేరికకు సీఎం చంద్రబాబు, లోకేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. శిద్దా రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోంది.. తెలియాలంటే వేచిచూడాలి..