Former Bhongir MLA Kommidi Narasimha Reddy Dies: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత 20 రోజుల నుంచి నిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి 1978, 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ జీవితంలో భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ.. సొంత ఇల్లు, కారు లేకుండా అద్దె ఇంట్లో జీవించారు. భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసి.. ‘భూదానశీలి’గా, ఎలాంటి అవినీతి ఆశించని నిజాయితీపరుడిగా ప్రజల మన్ననలు పొందారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉన్న ఆయన పెద్ద కుమార్తె నివాసంలో ఉంచారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నర్సింహారెడ్డికి నివాళులర్పిస్తున్నారు. నర్సింహారెడ్డి అంత్యక్రియలు రేపు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలు లేకుండా అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. నర్సింహారెడ్డి మృతికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

