Site icon NTV Telugu

Punjab: సింగపూర్‌లో శిక్షణ.. బయలుదేరిన 36 మంది స్కూల్ ప్రిన్సిపాల్స్

Punjab

Punjab

Punjab: వృత్తిపరమైన శిక్షణ కోసం స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ను సింగపూర్‌ పంపించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సింగపూర్ పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు. సింగపూర్‌కు వెళ్తున్న మొదటి బ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు సింగపూర్‌లో జరిగే ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్‌లో ప్రధానోపాధ్యాయులు పాల్గొంటారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ‘గ్యారంటీ’ ఇచ్చిందని భగవంత్ మాన్ చెప్పారు.

ఈరోజు 36 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కూడిన మొదటి బ్యాచ్ సింగపూర్‌కు వెళుతోంది. వారు అక్కడ ఐదు రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. సింగపూర్‌లోని ప్రిన్సిపల్స్ అకాడమీలో, వారు విద్యా రంగంలో అత్యాధునిక సాంకేతికతలను నేర్చుకుంటారనిఅని ముఖ్యమంత్రి చెప్పారు. మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 11న తిరిగి వస్తుందని, వారు తమ అనుభవాలను సహోద్యోగులతో పంచుకుంటారని చెప్పారు.అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా మారిపోయిందో, పంజాబ్ కూడా అదే పరివర్తన ప్రక్రియను చూస్తుందని మాన్ అన్నారు.

New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం

ఆరోగ్యం, విద్య రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తాము ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు కూడా పంపుతామని ఈ సందర్భంగా తెలిపారు. నేర్చుకోవడానికి కొత్త, సరికొత్త బోధనా మార్గాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు తాము ఉపాధ్యాయులను పంపుతామని వెల్లడించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో విద్య కోసం ఖర్చును కూడా పెంచుతామని ఆయన చెప్పారు.

Exit mobile version