Atrocious Incident in Tamilnadu: ఈ రోజుల్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫ్రికా అమ్మాయిలను కోడలిగా తెస్తున్నారు. ఇలాంటి సమాజంలోనూ నేటికీ పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తమకన్నా తక్కువ డబ్బు ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాడని… తక్కువ కులం వారిని వివాహం చేసుకుందని.. కన్నవారిని చంపుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకొందరేమో తమ బిడ్డను ప్రేమించిన వారిని హత్య చేస్తున్నారు. తమ కుటుంబానికి సరితూగరని.. ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది ఇతర కులాల వారిని, మతాల వారిని ప్రేమించిన పాపానికి ప్రేమికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటన ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది. ఈ పరువు హత్యకు కొడుకు, అత్త బలయ్యారు.
Read Also: Violence in Sambalpur: సంబల్పూర్లో చెలరేగిన హింస.. పట్టణంలో కర్ఫ్యూ విధింపు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దండపాణి అనే వ్యక్తి కుటుంబం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివాసం ఉంటోంది. అతని కొడుకు సుభాష్ ఓ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారితో మాట్లాడాలని వచ్చి కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలపై అక్కడికక్కడే మరణించాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది, పారిపోయిన కోడల్ని చంపడానికి వెతుకుతున్న క్రమంలో దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.