Bus Accident : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వంతెన పై నుంచి బస్సు పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 31మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖోరేగావ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. డోంగార్గావ్ సమీపంలోని బరోడ్ నదిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు ఖోరేగావ్ నుంచి ఇండోర్కు వెళ్తోంది. వంతెనపై బస్సు అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50మంది ఉన్నారు. క్షతగాత్రులను ఖోరోగావ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read Also:Vande Bharat: ఏమైంది రా.. ఎందుకురా రాళ్లదాడులు? ఎవరిమీద కోపం
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు రావడానికి ముందే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి కొందర్ని బయటకు తీశారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం ఇండోర్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేలు ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు. అటు కేంద్రం కూడా రూ.2 లక్షల మేర ఆర్ధిక సాయం ప్రకటించింది. క్షతగాత్రుల వైద్యానికయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Read Also:Errabelli Dayakar: విధుల్లోకి రండి మంత్రి విజ్ఞప్తి.. తగ్గేదే లే అంటున్న జూ.పంచాయతీ కార్యదర్శులు