Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం.
విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పోచంపల్లి, తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. “పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర,” అని ఆయన వ్యాఖ్యానించారు.
గత నెలలో, హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లోని ఫాంహౌస్లో కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా 61 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో భాగంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించగా, తొలుత ఆయన తన న్యాయవాదిని పంపారు. అయితే, వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మరోసారి నోటీసులు జారీ చేయడంతో, చివరకు నేడు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్..