అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయంటూ నమ్మించి.. క్షుద్రపూజల పేరుతో లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న ఓ కిలాడీ ఉదంతం కలకలం రేపుతోంది. ఆడవేషాలు వేసుకుని అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ఇళ్లను గుల్ల చేస్తున్న ఈ మాయగాడి చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు చివరకు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించింది. రామసముద్రం మండలానికి చెందిన సాకక్కగారి నాగరాజ సరస్వతమ్మ దంపతుల కుమార్తె ఉమ భర్తతో విడిపోయి ఎనిమిదేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది.
ఈ క్రమంలో ఆమెకు కలకడ మండలం నమ్మూరోల్లపల్లికి చెందిన సిద్ధలింగయ్య నాయుడు కుమారుడు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ అలియాస్ హనీతో పరిచయం ఏర్పడింది. ఉమ కుటుంబ సభ్యులతో మాట్లాడిన నిందితుడు.. మీ ఇంట్లో గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నారని నమ్మబలికాడు. వాటిని బయటకు పారదోలాలంటే శక్తి పూజలు, శాంతి పూజలు చేయాలని చెప్పి వారి ఇంట్లోనే తిష్టవేశాడు. పూజల పేరుతో లక్షల్లో డబ్బు, బంగారం తీసుకున్న నిందితుడు.. ఒంటరిగా ఉన్న ఉమకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తానని చెప్పి మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమె ఆస్తి మొత్తాన్ని అమ్మించి వచ్చిన డబ్బంతా కాజేశాడు. అంతకుముందే ఆమె వద్ద ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నాడు.
ఇంటికి పూజల పేరుతో ఎవరు వచ్చినా.. నిందితుడికి అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్లు నటిస్తూ చేతిలో త్రిశూలం, దండన కర్ర పట్టుకుని, నోట్లో రూ.500 నోట్లను పంటితో బిగబట్టి పూనకంతో ఊగిపోయేవాడు మోహన కృష్ణమ నాయుడు. ఇలా తనకున్న తాంత్రిక శక్తులతో దెయ్యాలను పారదోలుతానని నమ్మించి వచ్చిన వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేసేవాడు. ఇటీవల ఉమ దగ్గర ఉన్న డబ్బు, బంగారం కాజేసి వాటితో సొంత ఆస్తులు సమకూర్చుకున్నాడు. గుప్త నిధుల తవ్వకాలు, క్షుద్ర పూజల కోసం రాత్రి వేళల్లో కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ, కొత్తగా పరిచయమైన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ ఉమను ఇల్లు వదిలి వెళ్లగొట్టాడు. తాను మోసపోయానని గ్రహించి నిందితుడిని నిలదీయడంతో.. తన అనుచరులతో కలిసి ఉమను హతమార్చడానికి విశ్వప్రయత్నాలు చేశాడు.
ప్రాణరక్షణ కోసం రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. ఈ విషయమై రామసముద్రం ఎస్ఐ భషికేశ్వర రెడ్డిని వివరణ కోరగా.. నాలుగు నెలల క్రితం ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలిసిందని చెప్పారు. ప్రస్తుతానికి బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి ఉమకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

