NTV Telugu Site icon

Exoplanet: ఆ గ్రహం నిండా మహా సముద్రాలే.. భూమికి ఎంత దూరంలో ఉందంటే..

Exoplanet

Exoplanet

Exoplanet: సౌర కుటుంబం తర్వాత విశ్వంలోని మిగతా గ్రహాలపై శాస్త్రవేత్తలు ఎన్నో ఎళ్లుగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ‘ఎక్సో‌ప్లానెట్స్‌’ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా భూమిని పోలిన గ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా..? అనే వెతుకులాట కొనసాగుతోంది. ఇందులో కొంతమేర శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలు సాపేక్షంగా భూమిలాంటి లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు.

తాజాగా జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థ వెలుపల జీవనాధారమైన భారీ సముద్రాలతో కూడిన ఓ గ్రహాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు 5000 కంటే ఎక్కువ గ్రహాలు కనుగొనబడ్డాయి. అయితే ‘‘గోల్డిలాక్స్ జోన్‘‘ అని పిలువబడే ప్రదేశంలో ఉన్న గ్రహాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ జోన్‌లో ఉన్న గ్రహాలు తమ మాతృ నక్షత్రం నుంచి చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండని ప్రాంతంలో అంటే, జీవానికి అనుకూలమైన వేడి పొందే ప్రాంతంలో ఉంటాయి. ఇది జీవానికి చాలా అవసరం. మన భూమి కూడా ఇలాంటి ప్రాంతంలో ఉంటూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.

Read Also: Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..

తాజాగా కనుగొన్న గ్రహాన్ని LHS 1140 bగా పిలుస్తున్నారు. దీనిని తొలిసారిగా 2017లో కనుగొన్నప్పటికీ, ఇప్పుడే దీని గురించి పూర్తి వివరాలు తెలుస్తున్నాయి. ఇది భూమి నుండి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఓ విధంగా చెప్పాలంటే 450 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. విశ్వంలోని దూరాలతో పోలిస్తే ఇది సాపేక్షంగా దగ్గగా ఉన్నట్లే.

ముందుగా ఈ గ్రహాన్ని ‘‘మిని నెప్ట్యూన్’’ అని పిలువబడే భారీ వాయుగోళంగా భావించారు. హైడ్రోజన్, హీలియంతో కూడిన వాతావరణం కలిగి ఉందని అనుకున్నారు. అయితే, వెబ్ టెలిస్కోప్ పరిశీలన తర్వాత ఇది ‘‘సూపర్-ఎర్త్’’ అని నిర్ధారించారు. ఇది భూమి కన్నా 1.7 రెట్లు పెద్దది. దాని ద్రవ్యరాశి 5.6 రెట్లు ఎక్కువ అని ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో బుధవారం ఆలస్యంగా ప్రచురించింది. గ్రహం దాని నక్షత్రం ముందు నుంచి వెళ్తున్న క్రమంలో దాని వాతావరణాన్ని విశ్లేచించారు. హైడ్రోజన్, హీలియం సంకేతాలు లేకపోవడంతో దీనిని మినీ నెఫ్ట్యూన్ కాదని చెప్పారు. దీని ఉపరితలం ఎక్కువగా మంచు ఉన్నట్లు తెలుస్తోంది. విస్తారమైన ద్రవ సముద్రాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తు్న్నారు.