NTV Telugu Site icon

Perni Nani: సంపద సృష్టిస్తానని వేల కోట్లు అప్పులు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

Perni Nani

Perni Nani

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు. జగన్ కొత్త పోర్టులను సృష్టిస్తే, వాటిని ప్రైవేటు పరం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తనవారికి పంచుతున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయాలని చట్టంలో ఉంది.. కానీ 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం రామాయపట్నం ఊసే ఎత్తలేదని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ ఆ పోర్టును రెడీ చేశారు.. షిప్‌లు రావటానికి కూడా అనుమతులు వచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు.
బందరు పోర్టు వైయస్సార్ కల.. ఆ కలను జగన్ సాకారం చేస్తుండగా మళ్ళీ చంద్రబాబు వచ్చి ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు.

Pawan Kalyan: తమిళనాడులో విజయ్ పార్టీ ఏర్పాటు ..డిప్యుటీ సి‌ఎం‌ పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

ఆ పోర్టును చంద్రబాబు కట్టకపోగా రైతుల భూములను దోచుకోవాలని చూశారని పేర్ని నాని తెలిపారు. రూ.5,156 కోట్లతో జగన్ బందరు పోర్టు నిర్మాణం చేపట్టారు.. మూలపేట పోర్టు వలన శ్రీకాకుళం జిల్లాకు మణిహారంగా ఉంటుందని జగన్ భావించారు.. ఈ పోర్టులకు ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేకుండా జగన్ చూశారని అన్నారు. 17 మెడికల్ కాలేజీలను జగన్ ఏర్పాటు చేస్తే వాటిని కూడా చంద్రబాబు అమ్మేశారని ఆరోపించారు. ఈ తెగనమ్మకమేనా సంపద సృష్టించటం అంటే..? అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీలతో సహా 56 పరిశ్రమలను చంద్రబాబు అమ్మేశారు.. విశాఖలో కూడా ప్రభుత్వ భూములను చంద్రబాబు అమ్మేస్తున్నారని అన్నారు. ప్రజలపై రూ.6,072 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపారు.. ఇసుక బంగారంతో సమానంగా మారిందని గతంలో ఆరోపణలు చేశారు.. మరి ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.. చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి ఏం చేస్తున్నారు? అని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కరెంటు సంస్థల అప్పులు, నష్టాలు లక్ష కోట్లకు చేరాయి.. ఆ ఎఫెక్టు జగన్ ప్రభుత్వంపై పడిందని తెలిపారు.

Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

బాలినేని వ్యాఖ్యలపై..
ఆస్తుల విషయంలో విజయమ్మ జడ్జిగా ఉండాలన్న బాలినేని వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. జడ్జిగా ఉండేవారు మధ్యస్థంగా ఉండాలి కదా..? ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారు..? ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు..? అని పేర్ని నాని ప్రశ్నించారు. అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి.. బాలినేని రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు.. ఇప్పుడు జనసేనలో ఉన్నందున ఆ పార్టీ లైన్ మాట్లాడుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.