ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి ఎమోషనల్కు గురయ్యారు. ప్రచార సభలో ఓ కుర్రోడు చూపించిన ఫొటోను చూసి ఉద్వేగానికి గురయ్యారు. దీంతో మోడీ కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యప్రదేశ్ పర్యటనలో చోటుచేసుకుంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ఆయన.. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్నారు. దమోహ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్ తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోడీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపేశారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోడీ తెలిపారు. ఈ సన్నివేశంతో ఒక్కసారిగా సభకు వచ్చిన కార్యకర్తలంతా ఎమోషనల్కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: పిఠాపురం ప్రజలు ఆలోచించాలి.. లోకల్ హీరో కావాలా? సినిమా హీరో కావాలా..?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత శుక్రవారమే జరిగింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఈసారి 400 సీట్లకు పైగా ఎన్డీఏ గెలుచుకుంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.