NTV Telugu Site icon

Accident : ఖమ్మంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి

Road Accident

Road Accident

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని రక్షించారు. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బోనకల్‌ ఎస్‌ఐ మధుసూధన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంకరపట్నం మండలం తాడికల్ లో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురుని ట్యాంకర్ అదుపు తప్పి ఢీ కొట్టింది.. దీంతో.. పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. టాంకర్ డ్రైవర్ క్లీనర్ లను స్థానికులు గ్రామపంచాయితీలో బంధించారు. ఆస్సత్రికి తీసుకెళ్లిన వారి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.