‘ఎల్నినో’ ప్రభావం కేవలం వాగులు, నదులు, కాలువలకే పరిమితం కాలేదు. ఇప్పుడు కొబ్బరిబొండాల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొబ్బరి చెట్లలో నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. బొండాల్లో వచ్చే నీటి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక లీటర్ కొబ్బరినీరు నింపాలంటే మూడు కొబ్బరిబొండాలు సరిపోయేవని, ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో ఒక్కో బొండాలో వచ్చే నీటి పరిమాణం సగానికి తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ నింపాలంటే ఆరు కొబ్బరిబొండాలు కోయాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో వ్యయం పెరిగిపోతుండగా.. లాభాలు పూర్తిగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లో కొబ్బరిబొండాల ధరలు పెరగడంతో వినియోగదారులు కూడా కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు.
ఒకవైపు బొండాల్లో నీటి పరిమాణం తగ్గడం, మరోవైపు అమ్మకాలు మందగించడం వల్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాపారులు వాపోతున్నారు. ఎల్నినో ప్రభావం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కొబ్బరినీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉందని.. రైతులు, వ్యాపారులు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకృతి పరిస్థితులు సాధారణ స్థితికి రావడమే తమకు కాస్త ఊరటనిస్తుందని కొబ్బరిబొండాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

