ED Raids: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి భారీ సోదాలు నిర్వహించారు. విదేశీ పౌరులు, ముఖ్యంగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ముఠాపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. కీలక నిందితుడు వికాస్ నిమార్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పన్ను, రుణాల పేరుతో బెదిరింపులు..
దర్యాప్తులో భాగంగా నిందితులు అమెరికా ప్రభుత్వ విభాగాల అధికారులమని బాధితులను నమ్మించి, పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఉందంటూ భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించడం, డిజిటల్ చెల్లింపులు చేయించడం ద్వారా కోట్ల రూపాయలను అక్రమంగా సేకరించినట్లు విచారణలో తేలింది.
క్రిప్టోకరెన్సీగా అక్రమ సంపాదన:
బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బిట్కాయిన్తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అహ్మదాబాద్లో నిర్వహించిన సోదాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి వద్ద సుమారు 12 వేల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీ, అలాగే రూ.13.5 లక్షల నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నాలుగు నెలల క్రితం హైదరాబాద్లోని పలు నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్తో పాటు అహ్మదాబాద్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని కేంద్రాల్లో ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అనుసరించినట్లు ఈడీ గుర్తించింది.
మనీలాండరింగ్:
సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో మహమ్మద్ అన్సారి అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి. రాథోడ్లను నిందితులుగా పేర్కొంది.
డ్రగ్స్ కేసులోనూ..
ఫేక్ కాల్ సెంటర్ కేసుతో పాటు మరోవైపు బెంగళూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

