Bank Fraud: బ్యాంకు మోసం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. భోపాల్ జోనల్ కార్యాలయం అధికారులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద సుమారు రూ.3.66 కోట్ల విలువైన రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేశారు.
ఈ కేసు M/S అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (AOPL), దాని ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ.1,266.63 కోట్ల నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా AOPL, దాని ప్రమోటర్లు నకిలీ మెర్చంటింగ్ ట్రేడ్ లావాదేవీలు, సర్క్యులర్ ట్రేడింగ్, వాణిజ్య పత్రాల ఫోర్జరీ, బ్యాంకు నిధుల మళ్లింపు ద్వారా మోసపూరితంగా బ్యాంకింగ్ సదుపాయాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులను వివిధ దేశీయ, విదేశీ సంస్థల ద్వారా మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈడీ దర్యాప్తులో భాగంగా శ్రీకాంత్ భాసి పేరుతో జ్యూరిచ్ ఇంటర్నేషనల్ లైఫ్ లిమిటెడ్లో నిర్వహిస్తున్న రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు గుర్తించబడ్డాయి. ఈ పాలసీలు నేరం జరిగిన కాలంలోనే కొనుగోలు చేయబడినట్లు, విదేశీ ఖాతాలు మరియు భాసికి సంబంధించిన సంస్థల ద్వారా నిధులు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, 2026 ఏప్రిల్ నెలలో శ్రీకాంత్ భాసి ఈ రెండు పాలసీలను సరెండర్ చేయాలని కోరుతూ, వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని భారతదేశంలోని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని అభ్యర్థించినట్లు ఈడీ వెల్లడించింది.
నేరం ద్వారా సంపాదించిన ఆస్తులు ఇతరత్రా మళ్లించే అవకాశం ఉందని భావించిన ఈడీ.. PMLA చట్టంలోని సెక్షన్ 5(1) కింద ఈ రెండు పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి మొత్తం సరెండర్ విలువ సుమారు రూ.3.66 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ కేసులో గతంలో కూడా ఈడీ కీలక చర్యలు చేపట్టింది. దుబాయ్లో ఉన్న సుమారు రూ.51.70 కోట్ల విలువైన తొమ్మిది స్థిరాస్తులను, అలాగే భారత్లో సుమారు రూ.111 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు వెల్లడించింది. నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించడం, స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. మరిన్ని ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

