Honour Killing in East Godavari: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తపై అన్నదమ్ములు రాళ్లతో దాడికి పాల్పడి హత్య చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పరువు హత్యకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే బట్టల వ్యాపారిని రెండేళ్లుగా ప్రేమిస్తుంది. గత రాత్రి అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరివి బీసీ సామాజిక వర్గంలోని వేరువేరు కులాలు కావడంతో పెళ్లికూతురు అన్నదమ్ములు కక్ష పెంచుకొని వరుడు ప్రకాష్ రావు పై దాడి చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను స్థానికులు బంధించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.