EAP CET : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ , అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (EAPCET) పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షకు ఈ సంవత్సరం మొత్తం 3,06,796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 29 , 30 తేదీల్లో అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత, మే 2వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 2,20,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు 86,493 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గింది.
పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సంవత్సరం తొలిసారిగా ఎప్సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ను సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరు అనే నిబంధన కఠినంగా అమలు చేయబడుతుంది. ఉదయం సెషన్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుండి, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు మధ్యాహ్నం 1:30 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. విద్యార్థులు చేతులపై మెహందీ, టాటూలు లేదా ఇంక్ వంటి డిజైన్లు లేకుండా చూసుకోవాలి. పరీక్షకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ , బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకురావాలి.