Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఆటోను ఆపారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్కు 150 రీడింగ్ రావడంతో పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి ట్రాఫిక్ పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈలోపే ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా భావిస్తూ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Minister Savitha: ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదు..