పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికన్ వ్యతిరేక భావాల కారణంగా వెనిజులా దేశం వెళ్లొద్దని తన పౌరులకు అమెరికా హెచ్చరించింది. వెనిజులాను సందర్శించినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అత్యవసర సేవలు అందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉందని తెలిపింది. బందీలుగా చేసుకునే ప్రమాదం ఉందని.. వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ప్రోటోకాల్ను ఏర్పాటు చేసుకోవాలని సిఫార్సు చేసింది. తగు జాగ్రత్తలైతే తీసుకోవాలని పౌరులకు అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను జారీ చేసింది.
వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం తాము ఏమీ చేయలేమని అమెరికా ఉన్నతాధికారులు తేల్చిచెప్పేశారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో ‘ప్రూఫ్ ఆఫ్ లైఫ్’ ప్రోటోకాల్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియేనే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్ ఉద్దేశం. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ గుర్తుచేసింది.
సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది.