AP Pensions: రేపటి(మే 1) నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:30 గంటల నుంచీ 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే పింఛన్ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్ లింక్ కాని వారికి ఇంటివద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు.
Read Also: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
సచివాలయాలకు ఎవరూ ఎండనపడి రావద్దని అధికారులు అంటున్నారు. యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉండటంతో బ్యాంకు ఖాతాలకు బదిలీ త్వరగా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల నుంచీ తీసుకురావాల్సిన సొమ్ము కూడా తక్కువే కావడంతో పెన్షన్ల పంపిణీ సులభతరం కానుంది. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. కాగా.. ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు.