గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో రూపొందుతున్న అంతర్జాతీయ స్థాయి చిత్రం “కింగ్ బుద్ధ”. ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ను సీనియర్ దర్శకుడు సత్యారెడ్డి శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్లాండ్కు చెందిన బౌద్ధ భిక్షువులు చేపట్టిన 400 కిలోమీటర్ల పాదయాత్రలో సత్యారెడ్డి, చిత్ర యూనిట్ పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. స్వర్ణభూమి నుంచి బుద్ధభూమి వరకు సాగుతున్న ఈ యాత్రలో ‘కింగ్ బుద్ధ’ విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
Also Read : The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
ప్రపంచ శాంతి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గౌతమ బుద్ధునిపై సత్యారెడ్డి నిర్మిస్తున్న “కింగ్ బుద్ధ” చిత్రం ఇప్పటికే 10 బౌద్ధ దేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్ నుంచి తుర్కయాంజిల్ వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్న సత్యారెడ్డికి సీనియర్ మాంక్స్ (బౌద్ధ భిక్షువులు) బుద్ధుడి లాకెట్ను ధరింపజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అమెరికాలో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నాము. మరో 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ ఇండియాలోని ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా భాషల్లో విడుదల చేయడమే మా లక్ష్యం’ అని తెలిపారు.
దర్శకుడు సత్యారెడ్డి తన గత చిత్రం “ఉక్కు సత్యాగ్రహం” షూటింగ్ సమయంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ తనకు బౌద్ధిజం గురించి నేర్పించారని, ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు పూర్తిస్థాయిలో బుద్ధునిపై సినిమా నిర్మిస్తున్నానని తెలిపారు. బుద్ధుని జీవితం, పంచశీల సిద్ధాంతాలను నేటి తరానికి అందించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లను థాయిలాండ్, మలేషియాలలో లాంచ్ చేయనున్నట్లు, అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్లను ఢిల్లీ అమరావతిలలో భారీ ఎత్తున నిర్వహిస్తామని సత్యారెడ్డి స్పష్టం చేశారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి దర్శకుడిగా ఎదగడం తనకు గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.