Site icon NTV Telugu

India vs England: ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాలు సిద్ధం.. అభిషేక్ ఫామ్‌పై దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు

Dinesh Karthik

Dinesh Karthik

India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు భారత్ వ్యూహాలతో సిద్ధమైంది. నేడు ఇంగ్లాండ్‌తో ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు టాప్ ఆర్డర్ కూర్పుపై అనేక చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మపై చర్చ జోరుగా సాగుతుంది. అభిపై అభిమానులు, విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా అభిషేక్ శర్మపై నమ్మకం కొనసాగించాలని జట్టు నిర్వహణకు సూచించారు. అభిషేక్‌ను సెమీఫైనల్ నుంచి తప్పించాలనే అభిప్రాయాన్ని దినేశ్ కార్తిక్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో జట్టును ఇంతవరకు తీసుకొచ్చిన ఆటగాళ్లపై నమ్మకం కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపడం వ్యూహాత్మకంగా చాలా కీలకమన్నారు.

READ MORE: Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

ఇదిలా ఉండగా.. ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం అనేక వ్యూహాత్మక మార్పులతో సాగింది. ప్రారంభంలో ఎడమచేతి బ్యాటర్లతో కూడిన టాప్ ఆర్డర్‌ను ఉపయోగించిన జట్టు, పవర్‌ప్లేలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమస్య కారణంగా జట్టు నిర్వహణ తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. సూపర్–8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు సంజూ శాంమ్సన్‌ను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించారు. ఈ మార్పు వెంటనే కొంత ప్రభావం చూపింది. అయినప్పటికీ అభిషేక్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనపై సందేహాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ దశలో వరుసగా మూడు సార్లు సున్నాకే ఔట్ కావడం జట్టుకు ఆందోళన కలిగించింది. తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా, వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మాత్రం కేవలం 10 పరుగులకే అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో సంజూ అద్భుతంగా 97 పరుగులు చేయకపోయి ఉంటే భారత్ సెమీఫైనల్‌కు చేరడం కష్టమయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం..

READ MORE: Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!

Exit mobile version