Dharmendra Pradhan: సీజేపీ నిరసనలు, దేశ వ్యాప్తంగా ఉద్యమం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రాజీనామాకు ముందు జరిగిన పులు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల నిరసనల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ప్రభుత్వం రాజీనామాను తిరస్కరించి విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూలై 20న జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలోనూ ప్రధాన్ తన రాజీనామా ప్రతిపాదనను ముందట ఉంచగా, “సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటికి పరిష్కారం చూపడమే మోడీ ప్రభుత్వ నైజం” అని పేర్కొంటూ నాయకత్వం ఆయనను పదవిలోనే కొనసాగాలని కోరిందట.
అయితే, కొన్ని కీలక పరిణామాల వల్ల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తో జరిగిన రెండో విడత చర్చల అనంతరం, వారు జూలై 20 నాటి ‘చలో సంసద్’ తరహాలోనే మరో భారీ ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. అంతకుముందు జూలై 20 నిరసనల్లో పోలీసుల చర్య వల్ల పలువురు విద్యార్థులు గాయపడటం, దేశవ్యతిరేక శక్తులు ఈ ఆందోళనలను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను పెంచింది. డిజిటల్ మానిటరింగ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. భారతదేశంలోని విద్యార్థుల నిరసనలను మరింత రెచ్చగొట్టడానికి పాకిస్థాన్ నుంచి నడుస్తున్న దాదాపు 100 ఇన్స్టాగ్రామ్ ఖాతాలతో సహా, 400 కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని ఖాతాలు గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయడానికి ఉపయోగపడినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా, ఢిల్లీ పోలీసుల ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ ద్వారా జూలై 20 నుండి 24 మధ్య జంతర్ మంతర్ పరిసరాల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న దాదాపు 400 మంది వ్యక్తులు తిరుగుతున్నట్లు గుర్తించారు.

