Abhishek Sharma: భారత క్రికెట్లో సెన్సేషన్గా మారుతున్న యువ ఆల్రౌండర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు బ్రేక్ వేసింది. అభిషేక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలకమైన తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా రూపాన్ని (పర్సనాలిటీ రైట్స్) కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు, ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను, ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడమే కాకుండా, అతని గౌరవానికి, కమర్షియల్ వాల్యూకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. కొంతమంది సైలైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన, సభ్యసమాజం తలదించుకునే భాషను వాడుతూ పోస్టులు పెడుతుండగా.. మరికొందరు అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీషర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా మర్చండైజ్ (దుస్తులు, వస్తువులు) అమ్మడంపై పూర్తిగా నిషేధం విధించారు.
అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. నెట్టింట్లో అతనిపై పెట్టిన కంటెంట్ పూర్తిగా అబద్ధమని, అసభ్యకరంగా ఉంటూ అతని ప్రతిష్టను మసకబార్చేలా ఉందని జడ్జి అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం అభిషేక్ శర్మే కాదు.. గతంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, పాడ్కాస్టర్ రాజ్ శమని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి ఎందరో ప్రముఖులు తమ పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి మధ్యంతర ఉపశమనాన్ని పొందారు.

