AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Rainalert

Rainalert

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది తదుపరి మార్గంలో పయనిస్తూ రేపు పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, అలల ఉధృతి పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు ఎవరూ బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవల వినియోగం ప్రస్తుతం ఎంతమాత్రం సురక్షితం కాదని, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో అలజడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.