మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్ట్పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేవిధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని ఆమె అధికారులను ఆదేశించారు. MD MRDCL ఆమ్రపాలి ప్రాజెక్ట్ అంశాలను సమావేశంలో పాల్గొన్న అధికారులకు వివరించారు. ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల DPRలు, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ మొదలైన విభాగాలకు ఈ సమావేశంలో టైమ్లైన్లు నిర్ణయించబడ్డాయి.
ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని ఆమె చెప్పారు. అనేక ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD దానకిశోర్ తెలిపారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్సాగర్ డ్యామ్ డౌన్స్ట్రీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్సాగర్ డ్యామ్ డౌన్స్ట్రీమ్ పాయింట్ నుంచి బాపూఘాట్లో సంగమం పాయింట్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది. నగరంలోని మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది.