బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
Read Also: Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
ఇక, భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల దగ్గర తగిన జాగ్రత చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు.