OTR: రెడ్ ఐ ఎవరి మీద..?

  • కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్‌ మధ్య గ్యాప్‌..
  • పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల టైంలో విభేదాలు..
  • ఇటీవల సీపీఐ సభల్లో విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే కూనంనేని..
  • మరోసారి అధికారంలోకి రావాలంటూనే విమర్శలు
Red I

Red I

మీరు అధికారంలో ఉండాలని అంటారు… అంతలోనే పొట్టు పొట్టున తిట్టి పోస్తారు. మనం మనం బరంపురం… కలిసి పోరాడదాం, అవతలి వాళ్ళకు అస్సలు ఛాన్స్‌ ఇవ్వకూడదని అంటారు. వెంటనే బహిరంగంగా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. అంత వైవిధ్యంగా వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మిత్రుడిగా ఉంటూనే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?

కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మిత్ర పక్షాల మధ్య సమన్వయం లోపించి సమస్యలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా… సీపీఐ తెలంగాణ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, ఇక్కడి కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్‌ పెరుగుతోందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు చాలా మంది ఈ సీటు ఆశించారు. కానీ… కాంగ్రెస్‌ అధిష్టానం పొత్తులో భాగంగా మిత్రపక్షానికి కేటాయించడంతో హస్తం శ్రేణులు కూడా కలిసి పని చేసి కూనంనేనిని గెలిపించాయి. అదే సమయంలో మొదట్నుంచి కొత్తగూడెంలో లెఫ్ట్‌ పార్టీలకు పట్టు ఉండటం కలిసి వచ్చింది. అదంతా ఒక ఎత్తయితే ఇటీవల ఇక్కడి రాజకీయ సమీకరణలు మారుతున్నాయట. సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు వివాదాలు రేగుతున్నాయి.

గ్రామ పంచాయతి, మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామి రెడ్డి అక్కడే ఉండి ప్రణాళికలు రచించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన పలువురు అధికారులకు మంత్రి పొంగులేటి పోస్టింగ్స్‌ వేయించారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఆ తర్వాతి నుంచి ఎమ్మెల్యేకి, మంత్రికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందట. మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరికీ పోటా పోటీగా సీట్లు రావడంతో… పంచాయితీ అధిష్టానం దగ్గరికి చేరింది. మేయర్‌ పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకోమని చెప్పడంతో వివాదం అక్కడితో సమసి పోయిందని అనుకున్నారు.

కానీ.. వారి మధ్య ఇంకా సఖ్యత రానట్టే కనిపిస్తోందని అంటున్నారు. సిపిఐ సమావేశాల్లో సాంబశివరావు కాంగ్రెస్ పై విరుచుకు పడుతూనే ఉన్నారు. తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని అంటూనే…. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని చెబుతూనే.. విమర్శల విషయంలో మాత్రం తగ్గడం లేదు. తాజాగా పినపాక నియోజకవర్గం సభలో కాంగ్రెస్ పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు సీపీఐ ఎమ్మెల్యే. అయితే… ఆ పార్టీ అధికారంలో ఉండాలని మాత్రం కోరుకుంటున్నామని, బీజేపీ లాంటి పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జత కడుతున్నామని అన్నారాయన. ఈ క్రమంలో రాజకీయవర్గాలకు సరికొత్త డౌట్స్‌ వస్తున్నాయి. కాంగ్రెస్‌ పేరుతో కూనంనేని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా…దాని వెనక అసలు కారణం మంత్రి పొంగులేటి మీద వ్యతిరేకతేనని చెప్పుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి తన అనుచర గణాన్ని పెంచుకుంటున్నారట.

అలాగే గతంలో పినపాకలో సిపిఐకి పట్టు ఉండేది. ఇప్పుడు పొంగులేటి అనుచరుడైన పినపాక ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వరరావు కూడా గతంలో సిపిఐ నుంచి గెలిచిన వ్యక్తే. అయితే అక్కడ కూడా సీపీఐకి, మంత్రికి మధ్య విభేదాలున్నాయట. ఈ రెండు నియోజకవర్గాల్లో సిపిఐకి, పొంగులేటి అనుచరులకు మధ్య వివాదాలు రావడం వల్లనే కూనంనేని అధికార పార్టీ మీద భగ్గుమంటున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఇక భద్రాద్రి జిల్లాలో కూడా మంత్రి పొంగులేటికి అనుచర వర్గం బాగా ఉంది. అక్కడి ఎమ్మెల్యేల్లో నలుగురు తన వర్గం వారే ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌లో కూనంనేని సాంబశివరావుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య తేడా కొడుతోందని, దాన్ని బేస్‌ చేసుకునే ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తుండవచ్చన్నది లోకల్‌ పొలిటికల్ టాక్‌.