Gyanvapi case: జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో సర్వే చేయించాలన్న వారణిసి జిల్లా కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చిన స్టే ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది హైకోర్టు. శివాలయాన్ని ధ్వంసం చేసి… జ్ఞానవాపి మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. దీంతో ఈ విషయంపై సర్వే నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వారణిసి జిల్లా కోర్ట్ ఆదేశించింది. అయితే దీనిని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ ఇంతెజామియా మసీదు. దీంతో మసీదులో సర్వే ఎలా జరుగుతుందనే వివరాలను తెలుసుకోడానికి వారణాసి నుంచి ASI అధికారిని పిలిపించింది కోర్టు.
సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని, నిర్మాణానికి ఎలాంటి నష్టం ఉండబోదని ASI అధికారి తెలిపారు. సర్వే కేవలం 5 శాతం మాత్రమే జరిగిందని, జూలై 31 నాటికి పూర్తవుతుందని వివరించారు. అయితే, శాస్త్రీయ సర్వే వల్ల మసీదు దెబ్బతింటుందని వాదించింది మసీదు కమిటీ. వారణాసి కోర్టు జూలై 21న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. మరోవైపు… మసీదుకు ఎటువంటి నష్టం జరగదని వాదించారు హిందువుల తరఫు న్యాయవాది. తవ్వకాలు జరపబోమని సొలిసిటర్ జనరల్ సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేపై స్టే విధించింది. ఇవాళ విచారణ కొనసాగిస్తామని తెలిపింది. దీంతో ఇవాళ అలహాబాద్ హైకోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది.