MLC AnanthaBabu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్ను తూర్పుగోదావరి జిల్లా కోర్టు రద్దు చేసింది. సాక్షులను బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కొనసాగుతున్న సమయంలో సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ అనంతరం కోర్టు బెయిల్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. తాజాగా బెయిల్ రద్దు కావడంతో ఆయనకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు సంబంధించిన సాక్షుల విచారణ షెడ్యూల్ను కూడా రాజమండ్రి జిల్లా కోర్టు వెల్లడించింది. 2022 మే నెలలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నవంబర్ లోపు తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగవంతం అవుతుండగా, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
